.

దేవుడ్ని ఎలా అరాధించాలి? [దివ్య ఖురాన్: 3.31 ] --- తేది 27-02-10 ' మిలాడి నబి ' సంధర్భముగా.



దేవుడ్ని ఎలా అరాధించాలి, ఆయన అభీష్టము అధికారాలు ఏమిటి? ఏ పనులు చేస్తే , వేటిని మానుకుంటే మానవ జీవితము సార్ధకమవుతుంది? అనే విషయాలను దేవుడు మానవుల నిర్ణయానికి వదిలిపెట్టలేదు.
వీటికోసం ఆయన మానవులలోనుంచే కొందరు సజ్జనులను ఎన్నుకున్నారు. వారిద్వారా మానవాళికి తన ఆజ్ఞలను , హితవులను అందజేస్తున్నాడు. ఇలాంటి సత్పురుషులనే ఇస్లాం దైవ ప్రవక్తలని చెబుతోంది. మానవులు అజ్ఞానంతో సమస్యల సుడిగుండములో చిక్కుకున్నప్పుడు దయామయుడైన దేవుడు వారికి ఋజుమార్గం చూపేందుకు దైవ ప్రవక్తలను పంపించేవాడు. ఇస్లాం ప్రకారం దేవుడు ప్రతీ దేశములోను , ప్రతీ జాతిలోను దైవ ప్రవక్తలను ఉద్భవింప జేశాడు. వారందరు ఇస్లాం ధర్మాన్నే [ దైవ విధేయతా మార్గం ] బోధించారు.


అయితే దైవ ప్రవక్తల మరణానంతరము కొందరు స్వార్ధపరులు వారు తెచ్చిన దైవ గ్రంధాలను తారుమారు చేశారు. తిరిగి దేవుడు మరొక ప్రవక్తను పంపేవాడు. ఈ ప్రవక్తల పరంపరలలో అంతిమ దైవ ప్రవక్తగా ' మహనీయ మొహమ్మద్ 'ను ప్రభవింపజేశాడు. ఈయన ఒక ప్రత్యేక జాతికో , ఒక ప్రత్యేక కాలము కోసమో కాక ప్రళయం వరకు పుట్టబోయే యావత్తు మానవాళి కొరకు దైవ ప్రవక్తగా వచ్చాడు. కనుక ఏ దేశంలో వున్నా , ఏ జాతిలో పుట్టినా ప్రతీ ఒక్కరూ చివరి దైవ ప్రవక్త అయిన ' మొహమ్మద్ ' [ స అసం ] ను విశ్వసించడమే. ఆయన తెచ్చిన దైవ గ్రంధం ' ఖురాన్ " ను , ఆయన ప్రవచించిన సూక్తులను , ఆచరణ విధానాన్ని పాటించడమే విధి. తద్వారా మాత్రమే మనిషి నిజమైన ముక్తికి , మోక్షానికి అర్హుడవుతాడు.

ఓ మొహమ్మద్ ! వారితో చెప్పండి. మీరు దేవుడ్ని ప్రేమించినవారే అయితే నాకు విధేయత చూపండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ప్రేమిన్స్తాడు. మీ పాపాలను క్షమిస్తాడు.

[ దివ్య ఖురాన్ : 3.31 ]

[ తేది 16-08-96 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక సౌజన్యంతో ]

కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ ,తెది 26-02-2010.
.

పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలిపిన గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితములు.

ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో " నాధా! జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును , తరుణోపాయమును తెలుపమ"ని అడుగగా పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు.
పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు.
పాదముల యందు - పితృదేవతలు
కాళ్ళ యందు - సమస్త పర్వతములు
భ్రూమధ్యమున - గంధర్వులు
దంతముల యందు - గణపతి
ముక్కున - శివుడు
ముఖమున - జ్యేష్ఠాదేవి
కళ్ళయందు - సూర్య చంద్రాదులు
చెవుల యందు - శంఖు చక్రములు
కంఠమునందు - విష్ణుమూర్తి
భుజమున - సరస్వతి
రొమ్మున - నవ గ్రహములు
వెన్నునందు - వరుణ దేవుడు , అగ్ని దేవుడు
తోక యందు - చంద్రుడు
చర్మమున - ప్రజాపతి
రోమములయందు - త్రింశత్కోటి దేవతలు నివసించెదరు.
అందువల్ల గోమాతను పూజించి పాపములను పోగొట్టుకొని ఆయురారోగ్యములను , అష్టైశ్వర్యములను పొందవచ్చును. గోవులకు తృప్తిగా ఆహారము పెడితే సమస్త దేవతలకు ఆహారము పెట్టినంత పుణ్యఫలము కలుగుతుంది. మనసారా నమస్కరిస్తే సమస్త దేవతలకు నమస్కరించినంత పుణ్యము కలుగుతుంది. గోమాతకు ప్రదక్షిణము చేస్తే భూమండలము అంతా ప్రదక్షిణము చేసినంత ఫలము కలుగుతుంది." ---- 1993 స్వాతి వారపత్రికలోని సత్యాన్వేషణ లోనిది.
కర్మభూమి అయిన భారతావనిలో గోవులు అంతరించిపోతున్నాయి. వ్యవసాయ ఆధారిత భూములన్నీ కర్మాగారాలకు నెలవవుతున్నాయి. గోవులు అంతరించిపోతున్నాయి. నదీ పరివాహిక ప్రాంతాలలోనే గోవులు కనిపిస్తున్నాయి. అరణ్యాలలో వుండి గ్రామాలమీద పడి పశువులను ,మనుష్యులను తినివేసే పులులు అంతరించిపోతున్నాయని వాటిని అభయారణ్యాలలో రక్షణ కల్పించే చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వమువారికి గోవుల ఆక్రందనలు వినిపించడము లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి ఆవులు ,యెద్దులు అంతరించిపోతున్నా యెవరికీ చీమైనా కుట్టడము లేదు. జై మారుతీ! జై జై మారుతీ!!
స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!!
శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష !!

.

' మహా శివరాత్రి ' - 'లింగోద్భవకాలము.' [తేది 12-02-10 ]

"బ్రహ్మ" , "విష్ణువు" లు యిరువురూ పోటీపడి తమలో అధికులు యెవరో తెలియజేయమని "పరమేశ్వరుని" కోరగా "పరమేశ్వరుడు" తన ఆది,అంతము కనుగొనమని ఆద్యంత రహితముగా భూమిలోనుండి ఆకాశములోనికి లింగ రూపములో ప్రత్యక్షమయ్యాడు.

"బ్రహ్మ", "విష్ణువు" లు యిద్దరూ కలిసి "నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే " అని స్తోత్రము చేశారు. [ఈ స్తోత్రాన్ని శివ లింగ దర్శనము చేయు సమయములో ,అర్చన సమయములో పఠిస్తే చాలా శ్రేష్టము]

మహా శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయములో "పరమేశ్వరుడు" లింగ స్వరూపములో ఉద్భవించాడు. అదే శివలింగోద్భవ కాలము.ఆనాటి నుండి శివలింగ అరాధన మొదలయ్యింది. కర చరణాది అవయవాలు యేవీ లేని నిరాకార జ్యోతి రూపమే లింగము. జ్యోతి అన్ని దిక్కులనూ చూస్తుంది. పర బ్రహ్మ,శాశ్వతుడు అయిన "శివుడు" బ్రహ్మజ్యోతి స్వరూపుడు కనుకనే లింగ రూపుడై పూజల అందుకుంటున్నాడు. లింగ శబ్దానికి అర్ధము యేమిటనగా "లయనాల్లింగ ముచ్యతే" అనగా - యీ సృష్టి అంతా దేనిలో లయమయి [లీనమయి] ఉన్నదో అదే లింగము.

సముద్రము నుండి బయల్వెడలిన కాలకూట విషాన్ని పరమేశ్వరుడు పానము చేశాడు. తన శిరస్సు చల్లపడుటకై తన తలపై గంగను మరియు చంద్రుని ధరించెను. అతనికి అగ్నితో సమానమైన మూడవ నేత్రము ఉన్నది. నిరంతరము అభిషేకము చేయుటచే చల్లబడును.

శివుని పూజయందు అభిషేకము ఒక ప్రధానమైన అంశము. అభిషేకములేని శివపూజ అసంపూర్ణముగా ఉంటుంది. శివుడు అభిషేక ప్రియుడు . అభిషేకమునకు గంగా జలము,పాలు,నెయ్యి, తేనె, గులాబి జలము, కొబ్బరి నీరు, చందనము, పంచామృతము, సుగంధ ద్రవ్యము,చెరుకు రసము మరియు నిమ్మ రసము లు వాడతారు.

-----ఈ వ్యాసము తేదీ 26-02-93 స్వాతి వార పత్రిక ' సత్యాన్న్వేషణ ' శీర్షిక లోనిది.

తేది 12-02-10 న విశాఖ జిల్లా , భీమునిపట్నము బాలికల పోలిటెక్నిక్ కాలేజి కి వెళ్ళే త్రోవలో , n v కోలనీలో ,సుందర వనములో మహా శివ రాత్రి పర్వదినమున లింగోద్భవ సమయములో యీ సాధకునిచే నిర్వ హించబడుతున్న ' సామూహిక శివ పంచాక్షరీ మంత్ర జప సహిత మహా జ్యోతిర్లింగ అర్చనకు ఆహ్వానము పలుకుతున్నాము. భక్తులందరూ " ఓం నమశ్శివాయ" జపము చేస్తూ 500 లకు పైగా జ్యోతులను పార్ధివ శివలింగముపై పేర్చి మహా జ్యోతిర్లింగమును తయారు చేస్తారు. లింగోద్భవ సమయమునకు జ్యోతిర్లింగము పూర్తి అవుతుంది. ఆ విధముగా జ్యోతులతో యేర్పడిన జ్యతిర్లింగమును చూచుటకు భగవంతుడిచ్చిన రెండు నేత్రమలు చాలవు. లింగోద్భవ సమయములో జ్యోతులనుండి వచ్చు శబ్దములో ఒంకారము వుంటుందని పేద్దలు చెప్తారు.

గురు దేవులు శ్రీ ఆంజనేయ స్వామి దయ వలన జరుగుతున్న యీ కార్యక్రమమునకు మీరు రాలేక పోయినా లింగోద్భవ కాలములో మీరు వినోద కార్యక్రమములతో కాలక్షేపము చేయకుండా జీవితమును సార్ధకము చేసుకోవలసిందిగా కోరుతున్నాను.

మాతృ దేవో భవ! పితృ దేవో భవ !! ఆచార్య దేవో భవ !!!!

జై మారుతీ! జై జై మారుతీ!!

.

శ్రీ రామ నామ మహిమ[స్వామి శివానంద మహర్షి ,శ్రీ శివానంద ఆశ్రమము , ఋషీకేశ్ -తేది 08-08-1941]



భగవన్నామము ఆధ్యాత్మిక కల్పవృక్షము. అది మనో మాలిన్యముల విధ్వంసిని. అది పరమ శాంతిని , శాశ్వత ఆనందమును , అనంత జ్ఞానమును ప్రసాదించును. స్మరణ చేయువారి హృదయములో అది దివ్య ప్రేమను కురిపించును. అది సమస్త ఆనందములకు మూలము. అమృత ప్రసాదినియగు ఆ నామము మీ భయములన్నిటిని పోగొట్టి అందరకు ఉపశమనమును , పరమ సంతోషమును కలుగజేయుగాక!

శ్రీ రాముని నామము మధురతమమైన వస్తువులకంటే మధురమైనది. అది శాంతి ధామము. పవిత్ర ఆత్మల జీవనమే అది. అది ప్రపంచ వాసనలనెడు ప్రజ్వలితాగ్నులను చల్లార్చును. నీ హృదయములో నిహితమై యున్న దివ్యజ్ఞానమును అది మేల్కొలుపును. అది సాధకుని దివ్యానంద సాగరమున స్నానము చేయించును. శ్రీ రామునికి జయము! శ్రీ రామ నామమునకు జయము!!
ప్రతి వస్తువునందు ఒక్క రాముడు మాత్రమేఉన్నాడు. ఈ ప్రపంచమంతయు వారి లీల. రాముడు లేకుండా ప్రపంచమే లేదు. ఈ విశ్వమంతయు రామ మయము. రాముడు లేకుండా ప్రపంచమే లేదు. రాముడు , రామనామము వేరు కాదు.
శ్రీ రాముని చేరుటకు సాధన యేది యన వారి నామమును అనుసరించి అందులోనే లీనమగుటయే!
- ఏది వేద సాగరము నుండి మధింపబడినదో
- ఏది కలియుగమందలి దోషములను తొలగించునో
- ఏది సతతము పరమేశ్వరుని జిహ్వయందుండునో
- ఏది భవరోగములను పోగొట్టుతకు అమోఘమైన ఔషధమో
- ఏది జానకీ మాతకు ప్రాణము వంటిదో
అట్టి రామనామామృతమును నిరంతరము గ్రోలు పవిత్రాత్ముడు ధన్యుడగు గాక!

శాస్త్రములలో వర్ణింపబడిన పలు విధములైన జప మార్గములలో [ లిఖితి జపము ] మంత్రము వ్రాయుట శక్తితమమైనది. అది సాధకుని మనోధారణకు దోహదమును ఒసగి ధ్యానమునకు క్రమముగ గొంపోవును. నైతిక మార్గమున జిజ్ఞాసువుల ఆత్మ వికాసమునకు లిఖిత జపము చాల తోడ్పడును. మంత్రము వ్రాయునప్పుడు మనస్సు , జిహ్వ , చేతులు , కన్నులు మంత్రములో లీనమగుటచే పరధ్యానములు తగ్గి ధారణశక్తి పెంపొందును. మనో నిగ్రహము , శాశ్వత శుభ సంస్కారములు ,శాంతి , ఆత్మ శక్తి లభించును.

---- ఈ వ్యాసము యీ సాధకునిచే గురుదేవులు శ్రీ ఆంజనేయ స్వామి సంకలనము చేయించి 1989 మే నేలలో ముద్రింపించిన ఆధ్యాత్మిక దర్పణములోనిది.

జై మారుతీ ! జై జై మారుతీ !!
స్వామి రక్ష ! శ్రీ రామ రక్ష !!
శ్రీ రామ రక్ష ! సర్వ జగద్రక్ష !!

మాతృ దేవో భవ! పితృదేవో భవ!! ఆచార్య దేవోభవ!!!!

- అర్ధ సహస్ర సుందరకాండ కధాగాన శిరోమణి కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్
తేది 24-02-10


.