.

అంతర్జాల మితృలకు విన్నపము.


అనివార్య కారణాల వలన నెలకు పైగా కొత్తగా పోస్టులు పెట్టలెక పోయాను. అందుకు క్షంతవ్యుడిని.

ఈ సాధకుడు కేవలము గురుదేవులు ' శ్రీ ఆంజనేయస్వామి ' ప్రేరణ తోనే ఏవయినా ప్రత్యేక కార్యములు చేయగలుగుతున్నాడు. స్వామి నుండి ప్రేరణ లేకపోతే యెంత మంచి కార్యమైనా చేయడము లేదు. ఒక వేళ చేసినా దానికి ఆకర్షణ వుండదు. స్వామి ప్రేరణతో తులసీదాసు గారి అద్భుతమైన జీవిత చరిత్ర వ్రాత పని దాదాపు 5 సంవత్సరముల క్రిందట పూర్తి అయింది. కాని అది ముద్రణకు వెళ్ళే అవకాశము స్వామి యివ్వడము లేదు. 110 సంవత్సరముల క్రిందట అప్పటి గ్రాంధిక భాషలో ముద్రించబడిన గ్రంధము నుండి సేకరించబడినది. దానిని యిప్పటి వాడుక భాషలోనికి మార్చి వ్రాయుటకు చాలా ప్రయాస పడవలసి వచ్చింది.పూర్తిగా రెండు పర్యాయములు వ్రాయడము అయినది. ఆ పుస్తకము ముద్రణకు అవకాశము యివ్వమని కోరుతూ 3 సంవత్సరముల క్రిందట కాశీ వెళ్ళి తులసీదాసు మానస మందిరములో స్వామిని ప్రార్ధించినా అవలేదు. అందుచేత మొన్న హరిద్వార్ , ఋషీకేశ్ లలో 7 దినములు సుందరకాండ గానము చేసి ప్రార్ధించినా అవలేదు.

ఈ సాధకుడి చేత స్వామి ' తాత్పర్య సహిత నిత్య ప్రార్ధనా శ్లోకములు ' అనే చిన్నపుస్తకమును ముద్రణ చేయించారు.భక్తుల ఆదరణ వలన ఆ పుస్తకము 25 ముద్రణలతో మే నెల 2009 నాటికి 1 13 000 పుస్తకములు ముద్రించబడి ఆసక్తి గల భక్తుల వద్దకు చేరాయి. ఆ పుస్తకమును యింకా యెక్కువ విశేషములతో తీర్చి దిద్దే అవకాశము స్వామి యిచ్చారు. అది యింకా కూర్పులోనే వున్నాది.

ఈ లోగా హరిద్వార్ , ఋషీకేశ్ ల నుండి రాగానే స్వామి కొత్త పుస్తకము యిస్తున్నారు. అది ' శ్రీ హనుమద్వ్రతము '. ఆంజనేయ స్వామి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. కాని చిన్ని పుస్తకమే అయినా యెవరికి వారే సులభముగా పూజ చేసుకునే రీతిలో స్వామి చేయిస్తున్నారు. ఈ పుస్తకము అయినా ముద్రించే అవకాశము యిమ్మని యీ సాధకుడు గురుదేవులు శ్రీ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాడు. ఈ అవకాశము యీ సాధకుడికి యివ్వవలసిందిగా మీ పూజలలో కోరమని మీ అందరినీ కోరుతున్నాను.
జై మారుతీ ! జై జై మారుతీ !!

.